చిరంజీవిని ట్రోల్ చేయిస్తున్న దత్

Chiranjeevi

“ఫ్యామిలీ మేన్” వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజ్ – డీకేలు తీసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు వచ్చింది. మూడో సీజన్ త్వరలోనే రానుంది. కానీ, ఈ కథని మొదట సినిమాగా తీయాలనుకున్నారు రాజ్ డీకే. ఈ కథని మెగాస్టార్ చిరంజీవి కోసం వాళ్ళు రాశారు అన్న విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా బయటపెట్టారు.

ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చకు దారితీసింది. “ఖైదీ నంబర్ 150 విడుదలయ్యాక రాజ్ డీకే ఈ కథని చిరంజీవికి చెప్పారు. కానీ, చిరంజీవి గారికి తన పాత్రకు ఇద్దరు పిల్లలు ఉండడం నచ్చలేదు. కావాలంటే కథలో మార్పులు చేస్తామని రాజ్ డీకే అన్నారు. కానీ మెగాస్టార్ ఎందుకో సంశయించారు,” అని అశ్వనీ దత్ చెప్పారు.

అంతే, చిరంజీవి వ్యతిరేకులు ఇప్పుడు మెగాస్టార్ ని ట్రోల్ చేస్తున్నారు. 60 ప్లస్ వయసులో కూడా ఇద్దరు పిల్లల తండ్రిగా నటించేందుకు ఓ ఇదై పోవడం ఎందుకు అంటూ మెగాస్టార్ ని విమర్శిస్తున్నారు. “అవునులే మీకు “భోళా శంకర్”లాంటి కథలే నచ్చుతాయి,” అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అశ్వనీదత్ చెప్పిన ఈ విషయం మెగాస్టార్ ని ఇరుకున పెట్టింది. ఇన్నాళ్లూ విషయాన్నీ చెప్పని అశ్వనీదత్ “భోళాశంకర్” ఫ్లాప్ తర్వాత బయటపెట్టడం విశేషం. బహుశా దర్శకుడు మెహర్ రమేష్ తమ సంస్థకు “శక్తి” వంటి ఘోరాతిఘోరమైన ఫ్లాప్ ఇచ్చాడు అన్న కసితో ఇప్పుడు “భోళాశంకర్” ఫ్లాప్ తర్వాత అశ్వనీదత్ “ఫ్యామిలీమేన్” గురించి చెప్పి మనసు బరువు దింపేసుకున్నారా?

కారణం ఏదైనా అశ్వనీదత్ వల్లే ఇప్పుడు చిరంజీవి ట్రోలింగ్ కి గురువుతున్నారు.

Advertisement
 

More

Related Stories